YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

భయపెడుతున్న దెయ్యం చేపలు

భయపెడుతున్న దెయ్యం చేపలు

ఏలూరు, జూలై 15, 
సక్కర్‌ చేప.. వినడానికి వింతగా ఉన్న జెల్ల జాతికి చెందిన ఈ చేప ఆక్వా రైతులను బెంబేలెత్తిస్తోంది. నార్త్‌ అమెరికాలో ఈ చేపను అక్వేరియంలలో పెంచడానికి ఉత్పత్తి చేశారు. ఇది మన ప్రాంతంలోని జలాల్లోకి ఎలా వచ్చిందో ఏమోగానీ పంట కాలువల్లో విపరీతంగా పెరుగుతోంది.  ఆక్వా చెరువులను తుడిచిపెట్టేస్తోంది. దీంతో ఈ చేపను ఆక్వా రైతులు దెయ్యం చేపగాపిలుస్తున్నారు. ఒంటి నిండా మచ్చలతో నెత్తిమీద కళ్లు ఉండే ఈ చేప పంట కాలువల్లో నుంచి ఆక్వా చెరువుల్లోకి వెళ్లి మత్స్య సంపదకు వేసిన మేతను తినేస్తోంది. ఫలితంగా చెరువుల్లో రొయ్యలు, చేపలకు మేత చాలక ఎదుగుదల లోపిస్తోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ చేప తినేందుకు అనువైనదైనా దీని ఆకారం చూసి ఎవరూ తినడం లేదని అధికారులు చెబుతున్నారు. సక్కర్‌ చేప హోమ్నివారస్‌ జాతికి చెందింది. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్‌ క్లిపికోస్తోమస్‌. ఇవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి. రూప్‌ చంద్‌ తదితర చేపలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు మనదేశానికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఇది మంచినీటితోపాట కలుషిత జలాలు, ఆక్సిజన్‌ తక్కువ శాతం ఉన్న నీటిలోనూ బతికేస్తుంది. చేపలు, రొయ్యల చెరువుల్లోకి వెళితే వాటికి వేసే మేతను తినేయడం వల్ల ఆక్వా రైతుకు అపారనష్టం కలుగుతోంది. ఇది అరకేజి సైజు వరకూ పెరుగుతుంది. అక్వేరియంలో ఫిష్‌గా వాడతారు. నాచు, చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది. దీంతో అక్వేరియంలో అద్దాలకు పట్టిన నాచును శుభ్రం చేయడానికి దీనిని పెంచుతామంటున్నారు స్థానికులు.

Related Posts