న్యూ ఢిల్లీ జూలై 15
ఇవాళ వరల్డ్ యూత్ స్కిల్ డే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నైపుణ్యం అనేది స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలన్నారు. ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో.. వ్యాపారాలు, మార్కెట్లు అనునిత్యం ప్రభావానికి లోనవుతుంటాయని, కరోనా మహమ్మారి నేపథ్యంలో నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ నైపుణ్యానికి పదును పెట్టాలన్నారు. అయిదవ స్కిల్ ఇండియా వార్సికోత్సవ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగ ప్రవృత్తి మారిపోయిందని, టెక్నాలజీ కూడా మారుతూపోతున్నదని, కానీ మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా యువత నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారని మోదీ తెలిపారు. నైపుణ్యం అనేది మనకు మనం ఇచ్చుకునే బహుమతి అని, అది అనుభవంతో వృద్ధి చెందుతుందని, కాలానికి దీనితో సంబంధంలేదని, సమయం గుడస్తున్నాకొద్ది నైపుణ్యం పెరుగుతుందని మోదీ అన్నారు. నైపుణ్యం విశిష్టమైందన్నారు. ఇది ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేస్తుందన్నారు. జ్ఞానం, నైపుణ్యం మధ్య కొందరు ఎప్పుడూ అయోమయపడుతుంటారని ప్రధాని అన్నారు. పుస్తకాల్లో చదివి, ఇంటర్నెట్లో చూసి ఎలా సైకిల్ తొక్కాలో తెలుసుకోవచ్చు, దీన్నే మనం నాలెడ్జ్ అంటామని, కానీ ఆ జ్ఞానం ఉన్నంత మాత్రన సైకిల్ తొక్కే గ్యారెంటీ ఉండదన్నారు. వాస్తవానికి సైకిల్ తొక్కాలంటే.. మీకు స్కిల్ ఉండాలని ప్రధాని ఓ ఉదాహరణ ఇచ్చారు. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలన్న తపన లేకుంటే.. అప్పుడు జీవితం ఆగిపోతుందన్నారు. దాంతో అతని జీవితం భారంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు.