రాజస్థాన్ జూలై 20
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో పైలట్ టీమ్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ ఇచ్చిన నోటీసుల్లో.. స్పీకర్ కన్నా ముందుగా కోర్టు నిర్ణయం తీసుకోలేదని న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వి వాదించారు. స్పీకర్ను ప్రశ్నించే హక్కు రెబల్ ఎమ్మెల్యేలకు లేదన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు ఇది కుదరదన్నారు. రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరపున సింఘ్వి ఇవాళ కోర్టులో వాదించారు. అసెంబ్లీ, స్పీకర్.. కోర్టు పరిధిలోకి రావన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సచిన్ బృందానికి స్పీకర్ జోషి అనర్హత నోటీసులు జారీ చేశారు. శనివారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసిన అశోక్ గెహ్లాట్.. అసెంబ్లీ సమావేశాలు, బల ప్రదర్శనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సచిన్ పైలట్ టీమ్.. ఢిల్లీలోని ఓ రిసార్ట్లో ఉన్నది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదని, స్పీకర్కు నోటీసులు ఇచ్చే హక్కు లేదని వారు కోర్టులో వాదించారు. ఒకవేళ పైలట్ టీమ్పై వేటు వస్తే, అప్పుడు గెహ్లాట్ మెజారిటీ మార్క్ 102కు చేరుతుంది. ఆ దశలో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. 101 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం గెహ్లాట్కు కావాల్సిన సంఖ్య ఉన్నా.. ఆ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. 72 సీట్లు ఉన్న బీజేపీ.. సచిన్ పైలట్ను ఆహ్వానిస్తే.. ఇక అప్పుడు రాజస్థాన్ రాజకీయం మరింత ఉత్కంఠంగా మారే ఛాన్సు ఉన్నది.