హైద్రాబాద్, జూలై 21,
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీ నేత ఒకరు ఆరోపణలు గుప్పించారు. 30 ఏళ్లపాటు తనను వాడుకొని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నాయుడి ఇంటి ముందు బైఠాయించిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఆందోళన చేపట్టారు. తన సమస్యలను చెప్పుకోవడానికి సమయం ఇవ్వడం లేదని ఆయన టీడీపీ అధినేతపై ఆరోపణలు గుప్పించారు.తెలంగాణలో టీడీపీ కేవలం ఒకే ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన వేళ.. వెంకటేశ్వర రావు ఇలా ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తే.. ఫలితం ఉండేది. కానీ తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైన వేళ.. టీడీపీ నేత ఆరోపణలు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు అవాక్కయ్యారు.వెంకటేశ్వర రావు ఆరోపణలను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఖండించారు. బాబు నివాసం ముందు వెంకటేశ్వరరావు ఆందోళన చేపట్టడం బాధ్యతారాహిత్యమన్నారు. పార్టీ కార్యకర్తలకు తాము అందుబాటులో ఉంటున్నామన్నారు. పార్టీపై దుష్ప్రచారం కోసమే, ఆయన ఆందోళన చేశాడని విమర్శించారు. కాగా వెంకటేశ్వ రావు గతంలో కార్పొరేటర్గా పోటీ చేశారని తెలుస్తోంది.