జైపూర్, జూలై 21,
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సీనియర్ నేత. కాదనలేం. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిందే. కానీ ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని కూర్చోవడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. పోనీ ఆయన కొత్తగా చేపట్టిన పదవి కాదు. ఇప్పటికే రెండుసార్లు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.అశోక్ గెహ్లాత్ కాంగ్రెస్ కు నమ్మకమైన నేత. నిబద్దత కలిగిన నాయకుడు. అందుకే ఆయన కాంగ్రెస్ లో అంత స్థాయికి రాగలిగారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పుడు ఒకదశలో పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు వినపడింది. అంటే పార్టీకి ఆయన, ఆయనకు పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పకనే తెలుస్తుంది. అశోక్ గెహ్లాత్ కేంద్రమంత్రిగా కూడా అనేక పర్యాయాలు విధులు నిర్వహించారు.రాజస్థాన్ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అక్కడ జాతీయ పార్టీలే అధకారంలోకి వస్తాయి. ఒకసారి కాంగ్రెస్, మరొకసారి బీజేపీ ఇలా ఆల్టర్నేటివ్ గా అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. అశోక్ గెహ్లాత్ 1998 నుంచి 2003 వరకూ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత 2008 నుంచి 2013 వరకూ మళ్లీ అశోక్ గెహ్లాత్ సీఎం అయ్యారు. తర్వాత 2018 నాటికి మళ్లీ రాజస్థాన్ కు వచ్చి సీఎం సీట్లో సెటిలయ్యారు. ఇదే యువనేతలకు మండుకొచ్చే అంశమని చెబుతారు.నిజానికి కాంగ్రెస్ నాయకత్వం 2013లోనే సచిన్ పైలట్ కు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. 2013 లో జరిగిన ఎన్నికల్లో సచిన్ పైలట్ ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 21 స్థానాలే దక్కాయి. కానీ పైలట్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా 2018 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. ఊరూరా తిరిగి పార్టీని పటిష్టపర్చారు. కానీ చివరి నిమిషంలో అశోక్ గెహ్లాత్ సీటును ఆక్రమించేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయనను కెలుకుతూనే ఉన్నారు. దీంతో పైలట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లాత్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.