జైపూర్, జూలై 21,
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై జులై 24 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ అంశంపై వాదనలు పూర్తయ్యాయని తెలిపిన హైకోర్టు.. తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. స్పీకర్ ముందు వాదనలు వినిపించాలనే అభిప్రాయాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బలనిరూపణ చేసుకోవాల్సిన వేళ హైకోర్టు తీర్పుతో రాజస్థాన్ రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. 19 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయించి తేలిగ్గా పని పూర్తి చేసుకోవాలని అశోక్ గెహ్లాట్ వర్గం భావిస్తుండగా.. కోర్టు జులై 24 వరకు బ్రేకులు వేసింది. అశోక్ గెహ్లాట్ ఒకవేళ ఈలోగా బలనిరూపణకు వెళ్లాల్సి వస్తే చిక్కులు తప్పవు. లేనిపక్షంలో అప్పటివరకు ఆగడానికి గవర్నర్ ఆమోదిస్తారా అనేది మరొక ఆసక్తికర అంశం.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. మంగళవారం (జులై 21) సాయంత్రం సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆయన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.