హైదరాబాద్ జూలై 22
కరోనాను నియంత్రించే అవకాశాలున్నా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్వాగతించారు.ఐనప్పటికీ కేసులు పెరుగుతుంటే నిజాలను మరుగుపరిచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. తమ ఆదేశాల అమలుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం హెచ్చరించేలా పరిస్థితి దిగజారింది. అధికార యంత్రాంగాన్ని తాము ఇంతగా మందలిస్తుంటే... మెచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారన్న న్యాయస్థానం వ్యాఖ్యలతో పాలకుల నిజరూపం బట్టబయలైందన్నారు. చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికొదిలేశారన్న కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక తెలంగాణ సర్కారు నీళ్ళు నమలాల్సి వచ్చింది. ఇది చాలక మరోవైపు ప్రయివేట్ నర్సుల దుస్థితిపై హెచ్చార్సీ నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు నోటీసులు అందుకున్నారు. తాము ఎన్నుకున్న పాలకుల ఈ నిర్వాకాలతో జనం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి నెలకొందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేసారు.