YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఆగమము*

*ఆగమము*

ఆగమము అనగా *వచ్చినది* అని అర్దము. వైష్ణవ ఆగమము లలో రెండు రకములు ఉన్నాయి. అందులో ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది *'వైఖానశ ఆగమము'*, రెండవది గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే *'పాంచరాత్ర ఆగమము'.* నేడు అత్యధిక దేవాలయాలలో *పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి.* కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం *వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి.* మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.
*పాంచరాత్రము*
పాంచరాత్రమనగా శ్రీవైష్ణవులు పరమపవిత్రంగా భావించే ఆగమ శాస్త్రం. ఐదు రాత్రులనే అర్థం వచ్చే ఈ పాంచరాత్రం వెనుక ఎన్నో కథలూ, కథనాలూ కనిపిస్తాయి. ఈ పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది - మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు బలి క్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందడం. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది. 200కు పైగా గ్రంథాలు ఇందులో భాగం.
పాంచరాత్ర ఆగమం ఉదహరించిన కథనాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇది.
*హయవదనుడనే రాక్షసుడు వేదాలకు విధియయిన బ్రహ్మ నుండి తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నప్పుడు వేద క్రతువులు జరగక దేవతల శక్తులు తగ్గిపోసాగాయి.* *అప్పుడు అయిదు రాత్రుల పాటూ దేవర్షులంతా కలిసి అయిదు రాత్రుల పాటు మంత్రం లేనందువలన (వేదాలు లేవు కనుక మంత్రం లేదు) తంత్రంతో పూజ చేస్తారు. ఆ విధంగా విష్ణువు శక్తిమంతుడై మత్స్యావతారం దాల్చి హయవదనుణ్ణి చంపి వేదాలను రక్షిస్తాడు. తిరిగి హయగ్రీవ మూర్తిగా మారి వాటిని బ్రహ్మకు ఉపదేశిస్తాడు. అలా వేదాలు పోయి మరలా తిరిగి వచ్చిన వ్యవధి అయిదు రాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలో కాకుండా తంత్రంలో జరిగింది. అందువలన ఆ పంచరాత్రుల పేరు మీద పాంచరాత్రం అని ఈ ఆగమశాస్త్రానికి పేరు పడింది.* *ద్వాపరయుగమంతా భగవదారాధనకు మూలం పాంచరాత్ర ఆగమశాస్త్రమే అని మనకు తెలుస్తున్నది. ద్వాపర యుగంలో నారదుడు తిరిగి ఈ శాస్త్రాన్ని రుక్మిణికి ఉపదేశించి శ్రీకృష్ణుని మూర్తిని పాంచరాత్ర ఆగమశాస్ర్తయుతంగా పూజించమని చెబుతాడు. ఆపై రుక్మిణి నుండి అందరికీ ఈ విషయం వ్యాప్తి చెందుతుంది. గౌడీయ సాంప్రదాయంలో కూడా ఈ పూజా పద్ధతి కనిపిస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.* ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం.
పాంచరాత్రమనే పదానికి అర్థం - *ఐదు రాత్రులతో సంబంధం ఉన్నది* అని. ఒక కథ ప్రకారం కేశవుడు (విష్ణువు లేదా నారాయణుడు) ఈ పరమరహస్యమయిన తాంత్రిక విద్యను మొట్టమొదటగా ఐదు రాత్రుల పాటూ *అనంతుడికీ (ఆదిశేషుడు), గరుత్మంతుడికీ, విష్వక్సేనుడికీ, విధియయిన బ్రహ్మకూ, రుద్రునికీ నేర్పిస్తాడు.*
మరొక కథనం ప్రకారం రాత్రము అనే పదానికి *జ్ఞానము, జ్ఞప్తి, తెలివి* మొదలగు అర్ధాలు ఉన్నాయి. *ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టీ ఇది పాంచరాత్రమయింది.* ఈ ఐదు జ్ఞానాలు:
_తత్వము_
_ముక్తిప్రథము_
_భక్తిప్రథము_
_యౌగికము_
_వైషాయికము_
ఇంకొక కథనం ప్రకారం ఇది *భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రము కాబట్టీ పాంచరాత్రమయింది.* ఇవి :
_పర_
_వ్యూహ_
_విభవ_
_అంతర్యామి_
_అర్చ_
పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. _పాంచరాత్రాగమనానికి అనువుగానే నారాయణుణ్ణి పరమాత్మగా నమ్మడం, దేవాధిదేవుడిగా కొలవడం కనిపిస్తుంది_. రామానుజుల ప్రకారం పరమాత్మ ఐదు రూపాల్లో అవతరిస్తాడు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. మనుషులు భగంతుణ్ణి చేరేందుకు ఈ ఐదు రూపాల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ రూపాలను ఆరాధించవచ్చు.
*పర రూపం*
పరమాత్ముడి రూపమే ఈ పర.
*వ్యూహ రూపం*
ఆరు గుణాలతో కూడుకుని ఉన్న వాసుదేవుడే మొదటి వ్యూహ మూర్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవుడి నుండి ఉద్భవించిన సంకర్షణుడిలో *జ్ఞానము, బలము* అనే గుణాలు ఉంటాయి. సంకర్షణుడి నుండి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో *ఐశ్వర్యము, వీర్యము (వీరత్వము)* అనే గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో *శక్తి, తేజస్సు* అనే గుణాలు ఉంటాయి. ఇలా ఈ రూపాలను ఆయా గుణాలకు అధిదేవతలుగా కీర్తిస్తూ పూజించడం పాంచరాత్రుల సంప్రదాయం.
*అవతార రూపం*
వ్యూహ రూపం యొక్క సిద్ధాంతానికి దగ్గరగా ఉండేదే ఈ రూపం. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యూహ రూపంలో పేర్కొన్న నలుగురూ వేరు వేరు సమయాలలో అవతారాలుగా ఈ భూమిపైకి వస్తారు.
*అంతర్యామి రూపం*
ఈ రూపం *ప్రతీ మనిషిలోనూ ఉంటుందనేది నమ్మిక.* ఈ నాలుగో రూపం ప్రతి మనిషిలోనూ అనిరుద్ధుడి ద్వారా నియంరించబడుతుంది. ఈ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో హృదయకమలంగా స్థాపించబడి ఉంటుంది. ఇది వ్యూహంలోని ఒక్కడయిన అనిరుద్ధుడే కానీ పరమాత్మ కాదన్నది పండితుల వాదన.
*అర్చ రూపం లేదా అర్చావతారం*
నారాయణీయం లోలా కాకుండా పాంచరాత్ర
సంహితాలలో అర్చ రూపాన్ని భగవంతుని యొక్క స్వరూపంగా నమ్ముతారు. ఏదయిన జడ వస్తువు (విష్ణువు విగ్రహం లేదా పటం) ను సరియయిన పద్ధతిలో పాంచరాత్ర సంహితల ప్రకారం పూజించి, ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, అందులోకి అద్భుతమయిన శక్తులు వచ్చి, విష్ణువు యొక్క శక్తిని ఆ వస్తువు సంతరించుకుంటుంది. ఆ విధంగా ప్రతిష్ఠించిన ఆ వస్తువుకు అనుదినం నిత్యపూజ చేయాల్సి ఉంటుంది. ఈ అర్చ ఆరాధనకూ మూర్తి పూజకూ చాలా తేడా ఉంది. మూర్తి పూజలో ఆరాధకుడికి విగ్రహం యొక్క అంగములపై దృష్టి ఉంటుంది (అంగ పూజ మొ॥). అలా చేయటం ద్వారా కొద్ది కాలానికి ఆరాధకుడి దృష్టి ఒక బిందువుకు కుచించుకుంటుంది, ఆపై మూర్తి అవసరం ఉండదు. కానీ అర్చ పద్ధతిలో విగ్రహంలో భగవంతుడిని ఆరాధకుడు అనుభవిస్తాడు.
ఈ విధంగా 12 ఆళ్వారులూ వివిధ దివ్య దేశాలలో భగవంతుని అనుభవించారు.
*ఆగమాన్ని అనుసరిస్తున్న దేవాలయాలు*
ఈ ఆగమం ప్రకారం మంత్రం కన్నా భగవంతునిపై భక్తి పెక్కు రెట్ల ప్రభావం కలిగి ఉంటుంది. సంస్కృతంకన్నా ఆరాధకుడి మాతృభాషలో పూజలు చేయటం ఉత్తమంగా ఈ శాస్త్రం నమ్ముతుంది.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts