న్యూ ఢిల్లీ జూలై 23
తాము ఇచ్చిన అనర్హత నోటీసులపై రెబల్ ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ సుప్రీంలో స్పీకర్ జోషీకి జలక్ తగిలింది. హైకోర్టులో ఉన్నకేసుపై స్టే ఇవ్వలేమని సుప్రీం చెప్పింది. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్తో పాటు 19 మంది ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పూర్తి స్థాయి చర్యలు తీసుకోకముందే.. వారు కోర్టుకు వెళ్లడాన్ని స్పీకర్ జోషీ సుప్రీంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. రెబల్స్ వేసిన పిటిషన్పై శుక్రవారం కోర్టు తన తీర్పును వెలువరించేందుకు మార్గం సులువైంది. తటస్థ వ్యక్తి అయిన స్పీకర్ ఎందుకు కోర్టును ఆశ్రయించారని ఇవాళ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.ఓ నేత ఇతరులపై విశ్వాసం కోల్పోయినా.. ఒకవేళ వారు ఆ పార్టీలోనే ఉంటే వారిపై ఎలా అనర్హత వేటు వేస్తారని జస్టిస్ ఏకే మిశ్రా అడిగారు. ఇలా చర్యలు తీసుకుంటే అదే అలవాటుగా మారుతుందని, అప్పుడు వారు తమ స్వరాన్ని వినిపించలేరని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాన్ని ఇలా నొక్కిపెట్టలేమని జస్టిస్ మిశ్రా అన్నారు. స్పీకర్ జోషీ తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదించారు. పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరకాలేదని.. రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు కపిల్ తెలిపారు. ఈ దశలో రెబల్స్కు మద్దతుగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వరాదు అని ఆయన వాదించారు. స్పీకర్ డిసైడ్ చేయాల్సిన కేసులో కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు