న్యూ ఢిల్లీ జూలై 23
రాహుల్ వరుసగా వీడియోలు పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ..రాహుల్ గాంధీ ఇవాళ తన ట్విట్టర్లో మరో వీడియో పోస్టు చేశారు. ప్రధాని మోదీ నూరు శాతం తన ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారని తాజా వీడియోలో రాహుల్ ఆరోపించారు. చైనాను ఢీకొట్టాలంటే గ్లోబల్ విజన్ అవసరమని కాంగ్రెస్ నేత సూచించారు. ఒక వ్యక్తి విజన్.. జాతిప్రయోజనాలకు దర్పంగా నిలవదన్నారు. తానో శక్తివంతమైన వ్యక్తినంటూ మోదీ బూటకపు బిల్డప్ ఇస్తున్నారని ఇటీవలే ఓ వీడియోలో రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ పోస్టు చేసిన వీడియోలో.. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ ఎలా తన విధానాలను మార్చుకోవాలన్న సూచన చేశారు. మానసికంగా శక్తివంతమైన స్థానం నుంచే చైనాను ఢీకొట్టాలన్నారు. బలమైన పొజిషన్లో ఉంటేనే చైనాను ఎదుర్కోగలమన్నారు. కానీ బలహీనంగా ఆలోచిస్తే, అప్పుడు మనం ఏమీ చేయలేమన్నారు. ఎటువంటి విజన్ లేకుండా చైనాతో పోటీపడలేమని రాహుల్ అన్నారు. కేవలం జాతీయ విజన్ చాలదు అని, అంతర్జాతీయ విజన్తోనే చైనాను ఎదుర్కోవాలన్నారు. భారత్కు గ్లోబల్ విజన్ అవసరం అన్నారు. పెద్దగా ఆలోచించడం వల్లే భారత్కు మేలు జరుగుతుందన్నారు. మనం సుదీర్ఘంగా ఆలోచించడం లేదని, పెద్దగా కూడా ఆలోచించడం లేదని, అంతర్గత సమతుల్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నామని, మనం మనమే కొట్టుకుంటున్నామని, కేవలం రాజకీయాల వల్లే ఇలా జరుగుతోందని రాహుల్ అన్నారు. ప్రధాని ఒక ప్రత్యర్థి అని తనకు తెలుసు అని, కానీ ఆయన్ను ప్రశ్నలు అడగడం తన బాధ్యత అని, ఆయనపై వత్తిడి తేవడం వల్లే మెరుగైన ప్రదర్శన వస్తుందన్నారు. దేశానికి ఓ విజన్ను ప్రజెంట్ చేయడం ఆయన బాధ్యత అన్నారు.