లక్నో, జూలై 25,
లెక్కకు మించిన హత్యలు, దోపిడీలతో కొరకరాని కొయ్యగా మారిన గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా, మరో కరుడగట్టిన నేరస్థుడిని ఎన్కౌంటర్లో హతమయ్యాడు. లక్నోకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా బారాబంకీ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. అతడిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. 20కిపైగా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న టింకూ కపాలా అలియాస్ కమల్ కిశోర్ అలియాస్ సంజయ్ అలియాస్ మామపై యూపీ పోలీసులు రూ.1లక్ష రివార్డు ఉంది. పలు నేరాలతో సంబంధం ఉన్న టింకూ.. 2019లో ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడగా అడ్డుకున్న ఇద్దర్ని హత్యచేశాడు.హత్యలు, దోపిడీల్లో ఆరితేరి తప్పించుకు తిరుగుతోన్న టింకూ కోసం చాలా కాలం నుంచి పోలీసులు వెదుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఎట్టకేలకు బారాబంకీ వద్ద అనుచరులతో సహా అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో తమపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఘటానా స్థలిలో పేలుడు పదార్థాలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.భారీ దోపిడీకి పథకం వేసిన టింకూ.. లక్నో-బారాబంకీ సరిహద్దుల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. అతడు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టడంతో పారిపోయే ప్రయత్నం చేసి, పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు.. ఎదురుకాల్పులు జరిపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక, టింకూ కపాలా యూపీతోపాటు గుజరాత్, మహారాష్ట్రలోని భారీ దోపిడీలకు పాల్పడ్డారు. అతడిపై వడోదర, పుణేలో కేసులు నమోదయ్యాయి.తాజా ఎన్కౌంటర్పై యూపీ డీజీపీ హెచ్సీ అశ్వస్థీ స్పందిస్తూ... గత 20ఏళ్లుగా అనేక కేసులతో సంబంధం ఉన్న క్రిమినల్ కథ ముగియడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజలలో భద్రతా భావాన్ని సృష్టించడమే మాకు ముఖ్యమని అన్నారు.