YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అయోధ్య కు టైమ్ క్యాప్సుల్

అయోధ్య కు టైమ్ క్యాప్సుల్

లక్నో, జూలై 29,
ఒకవైపు అయోధ్యలో రామమందిరం భూమి పూజకు శరవేగంతో ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు రామాలయ నిర్మాణంలో ఒక అద్భుత విశేషం చోటు చేసుకుంటోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను ఆలయ నిర్మాణ స్థలంలోనే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇలా చేస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న రామాలయ నిర్మాణ స్థలంలోనే 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్‌ క్యాప్సూల్‌)ను ఏర్పాటు చేస్తామని కామేశ్వర్‌ చౌపాల్‌ పేర్కొన్నారు. ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు.  రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్‌ చౌపాల్‌ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు.కామేశ్వర చౌపల్ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో ఏకైక దళిత సభ్యుడు కావడం విశేషం.మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ నిర్వహించే భూమి పూజ క్రతువును వేడుకలా జరుపుకొనేందుకు ముస్లిం భక్తులు కూడా సన్నద్ధమవుతున్నారు. ఇస్లాంలోకి మారినా తమ పూర్వీకుడు శ్రీరాముడే అని నమ్ముతున్నామన్నారు.

Related Posts