బలుపు చూసి వాపు అనుకుంటున్నారు పవన్ కల్యాణ్. సినీ నటుడు కాబట్టి అభిమానులు వస్తారు. వారంతా తన కోసమే వచ్చారనుకుంటున్నారు పవన్. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఇప్పటివరకు ఏపీలో సొంతంగా పోటీ చేసిన ఎన్నిక ఒక్కటి కూడా లేదు. పవన్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 సీట్లకు పరిమితమయ్యారు. చిరు కంటే తక్కువ క్రేజ్ ఉన్న పవన్ కు 18 సీట్లు కూడా వస్తాయన్న గ్యారంటీ లేదన్నది రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లు చెప్పే మాట. మరి అలాంటి పవన్ ప్రధాన పార్టీ అండ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక అసలు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.మొన్న బెజవాడలో యాత్ర చేశారు పవన్ కల్యాణ్, కమ్యూనిస్టు నేతలు. సిపిఐ రామకృష్ణ, సిపిఎం మధులు ఈ యాత్రలో పాల్గొన్నారు. తమ పిలుపుకు స్పందించి ఇంత పెద్ద ఎత్తున రావడం సంతోషమని ఆ నేతలు ఘనంగా ప్రకటించారు. కానీ అది పవన్ కల్యాణ్ కు నచ్చలేదట. అందుకే ఇక మీదట వారితో కలిసి వెళ్లేటప్పుడు తన మైలేజ్ తాను చూసుకోవాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారిని పవన్ కల్యాణ్ అవమానించారని సమాచారం.
పవన్ కల్యాణ్ ను కలిసేందుకు జంట కవులు లాంటి రామకృష్ణ, మధులు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. ప్రత్యేకహోదా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు లెఫ్ట్ నేతలు.. అక్కడకు చేరారు. కానీ సెక్యూరిటీ గార్డులు వారిని లోపలికి పంపలేదు. పవన్ కి ఫోన్ చేస్తే స్పందించలేదు. పవన్ వ్యక్తిగత సిబ్బంది వచ్చినా వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. చాలా సేపు అలానే కూర్చున్న వారికి విసుగు వచ్చింది. మొన్న విజయవాడలో తామే గొప్ప అని చెప్పుకున్నాం. కొంప దీసి పవన్ ఈ సంగతి గ్రహించి మనలను ఇబ్బంది పెట్టడం లేదు కదా అనుకున్నారట. పావు గంట సేపు మధు, రామకృష్ణలు.. జనసేన ఆఫీసు ముందు పడిగాపులు కాశారు. పవన్ కోసం వచ్చిన కామ్రేడ్స్ కు అవమానమంటూ టీవీల్లో బ్రేకింగ్స్ వచ్చాయి. ఇక అప్పుడు గానీ పవన్ మేల్చొనలేదు. మీరు వచ్చారా.. నాకు చెప్పనే లేదంటూ పవన్ వారిని లోపలకు ఆహ్వానించారు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా చాలా సేపు వారు పవన్ కోసం వేచి ఉండక తప్పలేదు. కావాలని ఇలా జనసేన పార్టీ కార్యాలయం వారు చేశారంటున్నారు. లెఫ్ట్ తో కలిసి కార్యాచరణ అని పవన్ ఘనంగా ప్రకటించారు. కానీ లెఫ్ట్ పార్టీలేమో.. ఏదో మంచోడు అనుకుంటే ఇలా చేస్తున్నారేంటి అనుకుంటున్నాయి. అనంతపురంలో ఉమ్మడిగా పెట్టే సభల్లో జనసేన బాగా కనపడేలా చర్యలు తీసుకుంటున్నారట. దాంతో లెఫ్ట్ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. టీడీపీతో కలవలేరు. కాంగ్రెస్ తో వెళ్లలేరు. బీజేపీకి దూరం. అలాంటి సమయంలో ఏదో పవన్ పనికొస్తాడనుకుంటే చిన్న పిల్లల వేషాలు వేచి ఇబ్బంది పెడుతున్నాడే.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారట. ఏపీలో ఈనెల 16న జరగనున్న బంద్ కు లెఫ్ట్ పార్టీలు మద్దతునిచ్చాయి. పవన్ కు చెప్పకుండానే ఆ పని చేసాయి. దీంతో పవన్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. మద్దతు ఇవ్వకపోతే హోదాకు వ్యతిరేకమనే విమర్శలు వస్తాయి. మద్దతు ప్రకటిస్తే తాను ఆలస్యంగా స్పందించాననే మాట వస్తోంది. అన్ని రకాలుగా ఆలోచించిన పవన్ చివరకు ప్రత్యేకహోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకు మద్దతు ఇవ్వక తప్పలేదు.