లక్నోజూలై 30
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మోదీతో పాటు 50 మంది వీఐపీలు ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు. కరోనా ఆంక్షల మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యా నగరంలో భారీ సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని నలుగురు పూజాలు నిర్వహించనున్నారు. దాంట్లో పూజారి ప్రదీప్ దాస్ ఒకరు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆచార్య సత్యేంద్ర దాస్ శిశ్యుడే ప్రదీప్ దాస్. ప్రస్తుతం సత్యేంద్ర దాస్ హోం క్వారెంటైన్లో ఉన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్నది. బుధవారం దాస్ను ఇంటర్వ్యూ చేసిన కొందరు మీడియా వ్యక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. యూపీ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. అయోధ్యలో బుధవారం 66 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ నగరంలో నుంచి ఇప్పటి వరకు 605 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయోధ్య జిల్లాలో ఇప్పటి వరకు 13 మంది కరోనాతో మరణించారు.