హైద్రాబాద్, ఆగస్టు 3,
కేసీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ రంగం ప్రవేశం చేయనున్నారా? దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఓ ఆంగ్ల పత్రిక కథనం కూడా ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకురావాలనుకొనే ఆ వ్యక్తి ఇటీవల ఎక్కువగా ప్రగతి భవన్లో కనిపిస్తుండడం, కేసీఆర్తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.అయితే, ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో ఆయనతో కలిపి ఐదుగురు వ్యక్తులు పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఆరో వ్యక్తి కూడా రాజకీయాల్లో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మంత్రిగా ఉన్నారు. సీఎం మేనల్లుడు హరీష్ రావు మరో మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైన ఆయన కూతురు కవితను ఎమ్మెల్సీగా చేసి తిరిగి యాక్టివ్ చేశారు. మరో సోదరుడి కుమారుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ను ఎంపీగా రాజ్యసభకు పంపారు. తాజాగా ఇప్పుడు ఆరో వ్యక్తిగా మరొకరి పేరు తెరపైకి వచ్చింది.ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అనే సంగతి అందరికీ తెలిసిందే. తాను వాడే కాన్వాయ్ నెంబరు నుంచి తనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఏదో ఓ రకంగా 6 అనే అంకె ఉండేలా చూసుకుంటుంటారు. చివరికి తెలంగాణ కొత్త సచివాలయం కూడా ఆరు అంతస్తుల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తుండడం విశేషం. కేసీఆర్ అదృష్ట సంఖ్య అయిన 6 ఇప్పుడు తన ఫ్యామిలీ పాలిటిక్స్కు కూడా ఆపాదించే యోచనలో ఉన్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా.ఇంతకీ కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకురాబోయే ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? తన సోదరుడి కుమారుడైన వంశీని.. పార్టీలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవల వంశీ తరచూ ప్రగతి భవన్లోనే కనిపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా జ్యోతిష్యశాస్త్రాన్ని బలంగా విశ్వసించే కేసీఆర్ ఆ నిపుణుల సలహా మేరకే 6 అంకె వచ్చేలా తన కుటుంబం నుంచి మరో వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో కొందరు నేతలు ఇప్పటికే తమ పనుల కోసం వంశీని సంప్రదిస్తున్నారని టాక్. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే త్వరలోనే వంశీ రాజకీయాల్లోకి రావడం ఖాయమే అనే వాదన బలంగా వినిపిస్తోంది. పత్రికల్లో దీనికి సంబంధించి కథనాలు కూడా రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.