చెన్నై ఆగష్టు 3
కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయబోమని స్పష్టం చేశారు. ఎన్ఈపీలో మూడుభాషల సూత్రం బాధాకరమైనది, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. భాషల ఎంపిక అంశాన్ని రాష్ట్రాలకు వదిలేసినప్పటికీ, హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడులోని పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని తెలిపారు. 1965లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందీని అధికారిక భాషగా మార్చడానికి ప్రయత్నించినప్పుడు తమిళనాడు విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.