కుకట్ పల్లి లో శనివారం జరిగిన డా. అంబెద్కర్ జయంతి కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే సత్యనారాయణ జిల్లా కలెక్టర్నుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో తనను అగౌర పరిచారు నాకంటె ముందుగా కలెక్టర్ కు మెట్రో ఏండి కి మాట్లాడటానికి అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నాడంటూ మాట్లాడడంతో వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు వారించారు. మేం అధికారంలోకి వచ్చాకా మీ సంగతిచూసుకుంటాం. లీస్ట్ రెడీ చేసాం అని సభపైనే సర్వే అధికారులపై మండిపడ్డారు. సర్వే వ్యవహారం పై సహచర అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసారు. ఈ సమయంలో అంబేద్కర్ సభలో రాజకీయాలు వద్దంటూ వారించారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం, అలాగే సర్వేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా ఎమ్మెల్యే కృష్ణారావు, సర్వే సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చేయిదాటకుండా అదుపు చేశారు.