హైదరాబాద్ ఆగష్టు 7
ఎంఎస్ స్వామినాథ్ ఫౌండేషన్ ఆధ్వరంలో ఇవాళ నిర్వహించిన సైన్స్ ఫర్ రిసైలెంట్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీవుడ్స్ వర్చువల్ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి కోసం ఆధునిక శాస్త్ర, శాంకేతిక అంశాలను ఎంఎస్ స్వామినాథ్ ఫౌండేషన్ వాడుతున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఆకలిచావులు తగ్గినట్లు ఆయన చెప్పారు. పోషకాహారలోపాన్ని, శిశుమరణాలను కూడా అదుపులోకి తెచ్చినట్లు వెంకయ్య తెలిపారు. ఆరోగ్య, పోషకాహార సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యకరంగా, సామాజికంగా, సంసిద్ధంగా ఉన్న వారు విధ్వంసాల నుంచి వెంటనే తేరుకోగలరన్నారు. విపత్తులను ఎదుర్కొనే విధంగా వ్యక్తులను, ఇంటి సభ్యులను, సమాజాలను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిలియన్ల మంది ప్రజలకు బలమైన పోషక ఆహారాన్ని అందించాలంటే, వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా, లాభాదాయంగా మార్చాలన్నారు. పంట వేయడానికి ముందు, పంట కోత సమయానికి జరిగే నష్టాన్ని తగ్గించాలన్నారు. ఆహారపదార్ధాల్లో పోషక విలువలు తగ్గకుండా ఉండేందుకు.. స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్రిజర్వేషన్ లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఆధునిక టెక్నాలజీతో కలిపి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చాలన్నారు. డయేరియా లాంటి వ్యాధిని అరికట్టేందుకు రోటా వైరస్ టీకాలు ఇస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానంలో.. స్కూల్ పిల్లలకు బలమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని పొందుపరిచినట్లు చెప్పారు. ఆరోగ్య, పోషక సమస్యలపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.