వరంగల్, ఆగస్టు 10,
అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకోవడం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ ఒకే పార్టీలో ఉంటూ ఒక నాయకుడిపై మరో నాయకుడు బురదజల్లుకోవడం, ఒకరిని ఒకరు ధూషించుకోవడం చాలా తక్కువగా జరుగుతుంటాయి. వరంగల్ జిల్లాల్లో అది జరిగింది. ఎప్పటినుంచో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లాకు చెందిన ఒకే పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు ధూషించుకోవడం మాత్రమే కాదు ఒకరిపై మరొకరు దాడులు చూడా చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారుఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వరంగల్ పట్టణంలోని హన్మకొండ కాంగ్రెస్ భవన్ ముందు ఆదివారం యువజన కాంగ్రెస్ నేతలు కర్రలతో కొట్టుకున్నారు. అదే ఆవరణలో ఉన్న మరికొంత మంది నేతలు వారు మధ్య తగవును చూసి ఆపే ప్రయత్నం కూడా చేసారు. దీంతొ పలువురు కార్యకర్తలు పాపం గాయపడ్డారు. అంతే కాదు అదే ఘర్షనలో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఓ కారు కూడ ధ్వంసమైంది. ఈ రెండు వర్గాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు ఏ విషయం దగ్గర ఘర్షణ పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. గొడవకు గల కారణాలను పార్టీ నాయకత్వం ఇరు వర్గాల నుంచి సేకరించినట్టుగా సమాచారం.