గ్రేటర్ హైదరాబాద్లో తీవ్రంగా మారిన గుర్రపుడెక్క తొలగింపు, దోమల నివారణకు జీహెచ్ఎంసీ పకడ్బందీ ప్రణాళికలను చేపట్టింది. జీహెచ్ఎంసీ నీటి పారుదల లేక్స్ విభాగం ఎంటమాలజి విభాగాల ద్వారా నగరంలోని చెరువులు, కుంటల్లో పేరుకు పోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అయితే నగరంలో ఐదు ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్న కుంటల్లో ఎంటమాలజి విభాగం, ఐదు ఎకరాల కన్నా అధికంగా విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం ద్వారా గుర్రపు డెక్కను తొలగించాలని నిర్ణయించారు.
రూ. 7.65కోట్లతో 26చెరువుల్లో 495 ఎకరాలలో గుర్రపుడెక్క తొలగింపు
గ్రేటర్ హైదరాబాద్ అత్యంత తీవ్రంగా ఉన్న 26 చెరువుల్లో రూ. 7.65కోట్ల వ్యయంతో గుర్రపుడెక్కను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆడ్వర్యం లో స్టాండింగ్ కమిటి కూడా ఆమోదించింది. ఈ 26 చెరువుల్లో దాదాపు 495 ఎకరాల్లో గుర్రపుడెక్క విస్తరించి ఉంది. దీనిని తొలగించినప్పటికీ తిరిగి వెంటనే మొలవడం జరుగుతుంది. కొన్ని చెరువుల్లోనైతే కేవలం ఐదు రోజుల్లోనే రెట్టింపు స్థాయిలో గుర్రపుడెక్క తిరిగి మొలుస్తోంది..