హైదరాబాద్ ఆగస్ట్ 11
ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించడం హర్షణీయమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సిఎం ప్రకటన ద్వారా దక్షిణ తెలంగాణ వాసుల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నెలకొన్న సందేహాలు తొలగి విశ్వాసం ఏర్పడింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఘర్షణ వైఖరికి పోకుండా, చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా నదీ జలాల అంశాన్ని పరిష్కరించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ప్రాజెక్టుల వ్యవహారంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు.