ప్రపంచం గర్వించే మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని దేశమంతా పండుగలా జరుపుకుంటోంది. దళితులకు ఈ రోజు గొప్పదినమని అర్పించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా వరంగల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, బండ ప్రకాష్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మహానుభావుడు బి.ఆర్. అంబేద్కర్. ఈ రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి ఆయన హక్కులు కల్పించారు. అంటరానివారు, బలహీనవర్గాలు, దళితులకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి. అయితే కొంతమంది ఈ రిజర్వేషన్లకు వ్యతిరేక పోరాటాలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటాలను తీవ్రంగా ఖండించాలని అన్నారు. గతంలో సివిల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది, ఇది ఉన్నపడు దళితులపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు చర్యలు తీసుకునే విధంగానే ఉండేది. కానీ 1989 లో ప్రివెన్షన్ ఆప్ అట్రాసిటీ చట్టాన్ని రాం విలాస్ పాశ్వాన్ సోషల్ జస్టిస్ మినిస్టర్ గా ఉన్నపుడు తీసుకొచ్చారు. అత్యాచారాలు, హత్యలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు చేపట్టే గొప్ప ఉద్దేశ్యంతో తెచ్చిన బ్రహ్మాండమైన చట్టం ఇదని వివరించారు. అయితే ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఈ రిజర్వేషన్లను నీరుగార్చే విధంగా తీర్పు ఇవ్వడం దళితుల హక్కులను నీరుగార్చడమే. సుప్రీం కోర్టు బడుగు, బలహీన వర్గాలు రక్షణకు రావాలి, కానీ వారి హక్కులను నీరుగార్చే విధంగా రావడం దుర్మార్గమని అయన అన్నారు. రాజ్యాంగానికి ఏ వ్యవస్థ అతీతం కాదు, అలాగే న్యాయ వ్యవస్థ కూడా అతీతం కాదు. సుప్రీం కోర్టు రిజర్వేషన్లను 50 శాతం మించొద్దని తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ నిబంధన రాజ్యాంగంలో ఎక్కడ లేదు..సుప్రీం కోర్టు రిజర్వేషన్లకు కొత్త భాష్యం పలుకుతుందని అన్నారు. దళితుల హక్కులను నీరుగార్చే విధంగా ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇది శాంతి భద్రతల సమస్య గా మారుతుంది. దళితులు ఇప్పటికే రోడ్ల మీదికి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఇందులో చాలా మంది దళితులు చనిపోయారు. మరి ఎవరు ఈ మరణాలకు బాధ్యత వహిస్తారో కోర్టు చెప్పాలని అయన అన్నారు. సుప్రీంకోర్టు లో దళితులు లేనందునే దళిత వ్యతిరేకమైన ఇలాంటి తీర్పులు వస్తున్నాయని భావన ఉంది. పి.ఓ. ఏ చట్టం ఉండాగానే కేసులు నమోదు చేస్తున్నా నిందితులకు శిక్షలు పడడం లేదు.. ఇంకా ఈ చట్టానికి ఇలాంటి సవరణలు చేస్తే పి.ఓ.ఏ చట్టం లక్ష్యం మారుతుంది. దాని అర్థం మారుతుంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకొని ఇలాంటి తీర్పులు రాకుండా, అమలు కాకుండా చూడాలని అన్నారు. అనంతరం వరంగల్ బస్ స్టేషన్ వెనుక నిర్మించిన నెహ్రూ యువ కేంద్రాన్ని ప్రారంభించారు.