న్యూఢిల్లీ
ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నెతెచ్చారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వెంకయ్య నాయుడు మాటల్లో కళాత్మకత ఉంటుందన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి 'కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకం డిజిటల్ వెర్షన్ను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్జావడేకర్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. గత మూడేళ్లలో రాజ్యసభ చాలా మారిందని, సభ పనిచేసే సమయం పెరిగిందన్నారు. రాజ్యసభలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ముఖ్యమైన బిల్లులపై సమగ్ర చర్చకు అవకాశం లభించిందన్నారు. తన పదవీ కాలంలో మూడో ఏడాది కీలకమని, ఆ సమయంలో కీలక బిల్లులకు ఆమోదం లభించిందని వెంకయ్యనాయుడు అన్నారు. ముమ్మారు తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌర సవరణ చట్టం వంటి బిల్లులు ఆమోదం పొందాయన్నారు.