ఆపరేషన్ ద్రవిడ పేరుతో సంచలనానికి తెర తీసిన హీరో శివాజీ మరో బాంబ్ పేల్చారు. విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హోదా సాధన సమితి తరఫున మోదీ ఇచ్చిన హామీలపై ఓ సీడీని తయారు చేసి పంపించామన్నారు. రాజకీయ పార్టీల నేతలు మన ప్రాంతాలను అమ్మేసుకుంటున్నారని...ఓట్లు వేసిన పాపానికి ప్రజల్ని గందరగోళంలో పడేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ నేతల్లో అసహం పెరిగిపోతోందని... వారు సంయమనం పాటిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం మాట్లాడకుండా పరస్పరం విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.ఆపరేషన్ ద్రవిడ పేరుతో జాతీయ పార్టీ గొడవలకు ప్రయత్నిస్తోందని... మే మొదటివారంలో మరిన్ని నిజాలు బయటపెడతానన్నారు శివాజీ. హోదా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి... మన రాష్ట్రానికి రావాల్సిన హామీల్ని సాధించుకోవాలన్నారు. హోదా పోరాటాన్ని తొక్కేయడానికి స్వామిజీల గొడవలను తెరపైకి తెస్తున్నారని... రాష్ట్రం కొంపముంచింది రాజకీయ పార్టీలేనని విమర్శించారు. శివాజీ మే మొదటి వారంలో ఏం చెప్పబోతున్నారు... ఈ వ్యాఖ్యలకు ఆపరేషన్ ద్రవిడకు కొనసాగింపా అనే ప్రశ్నలే అందరిలో మొదలయ్యాయి.