మెదక్, ఆగస్టు 12
ఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగానే ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరు నిలబడతారు ? రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఎవరికి టిక్కెట్ ఇస్తారు ? ఇతర పార్టీల నుంచి పోటీ పెడతారా అనే విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉప ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని భావిస్తోంది.రామలింగారెడ్డి సీనియర్ టీఆర్ఎస్ నేత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారుడు. అవసరమైనప్పుడల్లా రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన అత్యంంత సన్నిహితుల్లో ఒకరు. నిజానికి రామలింగారెడ్డికి మంత్రి పదవి కూడా దక్కాలి కానీ ఇప్పటికే సిద్దిపేట నుంచి హరీష్రావు మంత్రిగా ఉండటంతో ఆయనకు అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో త్వరలోనే దుబ్బాక నియోజకవర్గనికి ఉప ఎన్నిక జరగనుంది.ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అదే కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఇతర పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవు. తెలంగాణలో మాత్రం ఇలాంటి అవగాహన ఏదీ లేదు. 2014 అసెంబ్లీకి ఎన్నికల నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి కొంత కాలానికి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన శాసనసభ్యులు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను కిష్టారెడ్డి కుమారుడు, పాలేరు ఉప ఎన్నికలో వెంకట్రెడ్డి సతీమణి పోటీ చేశారు.టీఆర్ఎస్ ఈ రెండు స్థానాల్లోనూ పోటీ పెట్టింది. తీవ్రంగా ప్రయత్నించి, భారీ మెజారిటీలతో ఈ రెండు స్థానాల్లో మరణించిన శాసనసభ్యుల కుటుంబసభ్యులను ఓడించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంది. దీంతో ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికకు కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ, రామలింగారెడ్డి తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుడు.వివాదరహితుడు. అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన నేత. అందుకే రామలింగారెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ తరపున పోటీ పెట్టకుండా తాను అధిష్టానాన్ని ఒప్పిస్తానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.అయితే, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. బీజేపీ తరపున దుబ్బాకలో రఘునందన్రావు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో రామలింగారెడ్డిపై ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడుఉప ఎన్నికలో గనుక బీజేపీ పోటీ పెట్టాలని భావిస్తే రఘునందన్రావు నిలబడే అవకాశం ఉంది. అయితే, టీఆర్ఎస్ మాత్రం పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు గానూ అన్ని పార్టీలతో సంప్రదింపులు కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నిక జరిగినా గెలుపు బాధ్యత మంత్రి హరీష్రావుకు అప్పగించనున్నారు.
టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆయన బతికి ఉన్నప్పుడే తన వారసుడిగా సతీష్రెడ్డిని తెరపైకి తేవాలని భావించారు. దీంతో ఇప్పుడు సతీష్ రెడ్డి పోటీ ఖాయమే అని తెలుస్తోంది.రామలింగారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం, సానుభూతి పనిచేస్తుంది కాబట్టి సతీష్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే కావొచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కారణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం చేయాలని టీఆర్ఎస్ ఇతర పార్టీలను కోరే అవకాశం ఉంది. కరోనా వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ఉండవద్దనే ఆలోచనతో ఇతర పార్టీలు ఉంటే దుబ్బాక ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమే.