హైదరాబాద్ ఆగష్టు 13
నిజాయితీ పన్నుదారులకు మరింత సులువైన విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, పన్నుదారుడు నేరుగా హాజరు కాకుండా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానంలో భారీ సంస్కరణలను చేపడుతున్నట్లు చెప్పిన ప్రధాని.. నిజాయితీ పన్నుదారుడు ఎటువంటి వేదనకు గురికాకుండా చూస్తామన్నారు. ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు తెలిపారు. సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నవారిని మరింత్ ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయవచ్చు అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పారదర్శక పన్నువిధానంలో ఫేస్లెస్ అసెస్మెంట్ అతిపెద్ద సంస్కరణ అన్నారు. ఫేస్లెస్ అపీల్, పన్నుదారుల పట్టిక కూడా సంస్కరణలో భాగమే అన్నారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్లు నేటి నుంచే అమలులోకి వస్తాయన్నారు. ఫేస్లెస్ అపీల్ సేవలు మాత్రం సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రతి నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏదో ఒక వత్తిడిలో సంస్కరణల పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటితో లక్ష్యాలను చేరుకోలేమన్నారు. అలాటి ఆలోచన, వ్యవహారం అన్నీ మారినట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానాన్ని సాఫీగా తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో పన్నుదారుడి చార్టర్ కూడా పెద్ద ముందడుగే అని తెలిపారు. పన్నుదారులను మరింత శక్తివంతంగా తయారు చేయడమే ప్రధాని లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నవిధానంలో పారదర్శకత ఉండాలని, నిజాయితీపరుడైన పన్నుదారుల్ని గౌరవించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు.