YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దామోదరం వర్సెస్ దయాకర్

దామోదరం వర్సెస్ దయాకర్

ఖమ్మం, ఆగస్టు 15, 
తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇంకా బ‌లంగా ఉంది అని చెప్పుకోవ‌చ్చు అంటే అది కేవ‌లం ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో మాత్ర‌మే. ఆ పార్టీకి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కులు, ప‌టిష్ట‌మైన ఓటు బ్యాంకు ఉంటుంది. అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌చ్చినా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జిల్లాలోని రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జిల్లాలో కాంగ్రెస్‌కు అన్ని అవ‌కాశాలు ఉన్నా నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు పార్టీని దెబ్బ‌తీస్తోంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య‌నేత‌లుగా ఉన్న వారు ఎక్కువ‌గా న‌ల్గొండ నుంచే ఉండ‌టం, వీరిలో వీరికి స‌యోధ్య లేక‌పోవ‌డం ఇంత‌కాలం జిల్లా కాంగ్రెస్ పార్టీకి స‌మ‌స్య‌గా ఉండేది.
పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కీల‌క నేత‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జానారెడ్డి, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డికి మ‌ధ్య గ‌తంలో స‌యోధ్య లేదు. దీంతో ఒక‌రికి చెక్ పెట్టేందుకు ఇంకొక‌రు ప్ర‌య‌త్నించేవారు. ఓట‌ముల‌తో గుణ‌పాఠం నేర్చుకున్నారో ఏమో కానీ ఇటీవ‌ల వీరంతా ఒకే మాట మీద ఉంటున్నారు. కీల‌క నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిరింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు నేత‌ల మ‌ధ్య గొడ‌వ మొద‌లై కేసులు పెట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇది మ‌రింత దూరం వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి గ‌తంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఇది ఆయ‌న‌కు స్వంత నియోజ‌క‌వ‌ర్గం లాంటిది. అయితే, 2009లో ఎస్సీ రిజ‌ర్వు కావ‌డంతో ఆయ‌న సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గానికి మారారు. సూర్యాపేట‌కు మారినా తుంగ‌తుర్తిలో త‌నకంటూ ప్ర‌త్యేక వ‌ర్గం ఉంది. నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ త‌న క‌నుస‌న్న‌ల్లోనే ఉండాల‌ని ఆయ‌న భావిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం ఇక్క‌డ దామోద‌ర్ రెడ్డికి అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు.2014, 2018 ఎన్నిక‌ల్లో దామోద‌ర్ రెడ్డి ప్ర‌తిపాదించిన వారిని కాకుండా మాల మ‌హానాడు నేత‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు అద్దంకి దయాక‌ర్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. ఈ రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చి టీఆర్ఎస్ చేతిలో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ ర‌వి అనే నేత‌కు టిక్కెట్ ఇప్పించాల‌ని దామోద‌ర్ రెడ్డి చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. కానీ, టిక్కెట్ అద్దంకి దయాక‌ర్‌కే ద‌క్కింది. అప్పుడే అద్దంకి దయాక‌ర్‌పై దామోద‌ర్ రెడ్డి మీడియా ముందే చిందులు తొక్కారు.తెలంగాణ కాంగ్రెస్‌లో అద్దంకి ద‌యాక‌ర్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉంది. పార్టీవాద‌న‌ను బ‌లంగా వినిపించ‌గ‌లిగే అధికార ప్ర‌తినిధి ఆయ‌న‌. దళిత వ‌ర్గం నుంచి ఎదుగుతున్న నాయ‌కుడు. అయితే, ఇప్పుడు అద్దంకి ద‌యాక‌ర్‌కు తుంగ‌తుర్తిలో దామోద‌ర్ రెడ్డి చెక్ పెడుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తుంగ‌తుర్తిలో అద్దంకి ద‌యాక‌ర్‌ను త‌ప్పించి త‌న వ‌ర్గీయుడిని ప్రోత్స‌హించి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇప్పించుకోవాల‌ని దామోద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో అద్దంకి ద‌యాక‌ర్‌ను దామోద‌ర్ రెడ్డి వివిధ ర‌కాలుగా ఇబ్బందులు పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.దీంతో దామోద‌ర్ రెడ్డి విష‌య‌మై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు అద్దంకి 10 రోజ‌ల క్రితం ఫిర్యాదు చేశారు. అయినా, వారి వ‌ద్ద నుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు. దీంతో నేరుగా ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి అద్దంకి దయాక‌ర్ ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం దామోద‌ర్ రెడ్డికి తెలిసి అద్దంకి ద‌యాక‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారట‌. దామోద‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో నొచ్చుకున్న అద్దంకి ద‌యాక‌ర్ ఇక దామోద‌ర్ రెడ్డి విష‌యంలో తాను కూడా తాడోపేడో తేల్చుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.దామోద‌ర్ రెడ్డి త‌న‌ను కులం పేరుతో దూషించార‌ని, ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాల‌ని ఆయ‌న హైదరాబాద్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ గొడ‌వ కాస్తా పోలీసుల వ‌ర‌కు వెళ్లింది. అయితే, తాను మాత్రం తుంగ‌తుర్తి నుంచి త‌ప్పుకునే అవ‌కాశ‌మే లేద‌ని అద్దంకి ద‌యాక‌ర్ స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి, వీధికెక్కిన తుంగ‌తుర్తి కాంగ్రెస్ నేత‌ల పంచాయితీని జిల్లాలోని కాంగ్రెస్ హేమాహేమీలు ఎలా ముగిస్తారో చూడాలి.

Related Posts