వరంగల్ ఆగస్టు 18,
భారీ వర్షాల కారణంగా తెలంగాణ వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకునేందుకు మంత్రులు కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నగరంలో పర్యటించారు. నయీంనగర్ నాలాను మంత్రులు సందర్శించారు. స్థానికులను మంత్రి కేటీఆర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. ఇళ్లల్లో బియ్యం, నిత్యవసర వస్తువులు, దుస్తులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి 10కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నగరంలో ఆక్రమణలు తొలగిస్తామని.. స్థానికులు సహకరించాలని కోరారు. భోజన విరామం తర్వాత నిట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అంతకు ముందు విహంగ వీక్షణం ద్వారా ఓరుగల్లు నగరాన్ని కేటీఆర్ పరిశీలించారు.