న్యూ ఢిల్లీ ఆగస్టు 19
ఆర్టికల్ 370 రద్దు చేయడమో లేక మరో కారణమో తెలియదు గాని ఉగ్రవాదులు బిజెపి నేతలను టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా హిందూ జాతీయవాద సంస్థల నేతలను టార్గెట్ గా చేసుకున్నాయని కేంద్ర నిఘా సంస్థ అన్ని రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను ఐబీ అప్రమత్తం చేసింది. దీన్ని తమిళనాడు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా బీజేపీతో పాటు.. ఆరెస్సెస్ ఏబీవీపీ వీహెచ్ పీ వంటి సంస్థలకు చెందిన ప్రముఖ నేతలను హత్య చేసేందుకు ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని ఐబీ హెచ్చరికలు జారీచేసింది.భారత్ లో అలజడి సృష్టించేందుకు ఏదో ఒకటి చేయాలంటూ ఉగ్రవాద సంస్థలపై ఒత్తిడి ఉందని దీంతో.. స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ స్టేట్ ఇతర ఉగ్రవాద సంస్థలు హిందూ జాతీయవాద సంస్థలనేతల దినచర్యలపై నిఘా పెట్టాయని తెలిపింది. అలాంటి నేతలను గుర్తించి వారికి భద్రత పెంచాలని ఉగ్రదాడుల అవకాశాలను వారికి వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతోనే 20 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. మరో హెచ్చరికలో విమానాశ్రయాలు ఎయిర్ స్ట్రిప్స్ నౌకాశ్రయాలపై పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐసిఐ ప్రేరేపిత తీవ్రవాద బృందాలు దాడులు చేసే ప్రమాదముందని ఐబీ తెలిపింది. బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల నుంచి చొరబాట్లకు ఉగ్రవాదులు తీవ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించింది.