శిశు లింగ నిర్థారణకు పాల్పడే నర్సింగ్ హోంలు, స్కానింగ్ కేంద్రాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సరళ నేతృత్వంలో లింగ నిర్థారణ, అబార్ష్న్లు చేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్, ఓ ఆసుపత్రిని ఇప్పటికే సీజ్ చేశారు. దీంతో పాటు స్కానింగ్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సోనాలజిస్టులు, గైనకాలజిస్టులు, వారి అర్హతలు, సెంటర్లలో ఉన్న యంత్ర పరికరాల వివరాలపై ఆరా తీస్తున్నారు. అలాగే రెన్యువల్ చేసుకోని కేంద్రాలు, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్హోంలపై ఇక చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నగరంలో సుమారు 1500లకు పైగా స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి.అయితే అధికారుల లెక్కల ప్రకారం 1115 సెంటర్లు మాత్రమే ఉన్నాయి.అనుమతులు లేని సెంటర్లనూ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. స్కానింగ్ సెంటర్లు, అబార్షన్లు చేసే నర్సింగ్హోములకు సంబంధించిన వైద్యులు మెడికల్ టర్నినేషన్ ప్రెగ్నెన్సీ–1971 (ఎంటీపీ) చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ పలు ఆసుపత్రులు ఈ చట్టాన్ని పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో నెలకు వందలాది అబార్షన్లు అవుతున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల అంగీకారంతో అబార్షన్ చేస్తున్నారు. ఇందుకుగాను రూ.10 నుంచి రూ.15 వేలు దండుకుంటున్నారు. మెడిసిన్తో అయితే ఒక రేటు, శస్త్ర పద్ధతిలో అయితే మరో రేటు వసూలు చేస్తున్నారు. నర్సింగ్హోమ్లకు ఉండే ప్రాధాన్యతను బట్టి అబార్షన్లు చేస్తున్నారు. బస్తీలు, చిన్న గల్లీల్లో ఉండే నర్సింగ్హోముల్లో రూ.5 వేలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల భర్త, కటుంబ సభ్యులు ఎవరి అనుమతి లేకున్నప్పటికీ అబార్షన్లు చేసి పంపిస్తున్నారు. ముఖ్యంగా అవివాహితల విషయంలో ఈ తరహా జరుగుతున్నట్లు సమాచారం.