సిద్ధిపేట ఆగస్టు 24
పట్టణంలో ప్లాస్టిక్ నిషేధిద్దాం.! పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.! ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేస్తూ.. ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంకు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, ప్రజలు స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీ రంగదాంపల్లి 9వ వార్డులో సోమవారం ఉదయం స్టీల్ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు మొదటి ఆర్డర్ మంత్రి చేతుల మీదుగా బుకింగ్ చేసుకున్నారు. స్టీల్ బ్యాంకులు ప్రారంభం చేస్తూ.. ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని స్టీల్ బ్యాంకు సామాగ్రి కిరాయి సమగ్ర పట్టిక వివరాల పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. వార్డుల్లోని ప్రతి ఇంటింటా తిరిగి అవగాహన కల్పించాలని ఆ వార్డు కౌన్సిలర్, మెప్మా- ఆర్పీలను మంత్రి ఆదేశించారు. ముందుగా 9వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెడ్డి సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.