న్యూఢిల్లీ ఆగస్టు 24,
కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి దివంగత అరుణ్జైట్లీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ‘గతేడాది ఇదే రోజున నా స్నేహితుడిని కోల్పోయాను’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన మేధా సంపత్తి, వ్యక్తిత్వ వికాసం మరువలేనివని పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం నిర్వహించిన సభలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు. వీడియోను కూడా షేర్ చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అరుణ్ జైట్లీ సేవలను గుర్తు చేసుకున్నారు. గొప్ప రాజకీయ వేత్త, గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం అరుణ్ జైట్లీని స్మరించుకున్నారు. మంచి మిత్రుడు, మార్గదర్శకుడని కొనియాడారు. బీజేపీ నేత పూనమ్ మహాజన్ సైతం కేంద్ర మాజీ మంత్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైట్లీ ముఖ్యమైన ప్రసంగాలను ట్వీట్ చేశారు. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో గత ఏడాది ఆగస్టు 24న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూశారు.