న్యూ ఢిల్లీ ఆగష్టు 25
కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన లాయర్ ప్రశాంత్ భూషణ్ కు కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అంటూ ఇవాళ సుప్రీంకోర్టును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. వివాదాస్పద ట్వీట్ల కేసులో రెండు రోజుల సమయం ఇచ్చినా.. ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. దీంతో ఈ కేసులో ఇవాళ అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందించారు. భూషణ్ను శిక్షించడం అవసరం లేదని, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ .. ప్రజల క్షేమం కోరుతూ ఎన్నో పిల్స్ వేశారని, ఆయన చేసిన పబ్లిక్ పనులను గుర్తించి వదిలేయాలని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తూ చేసిన రెండు ట్వీట్ల అంశంలో ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యింది.ప్రశాంత్కు వార్నింగ్ ఇచ్చి వదిలేయాలంటూ అటార్నీ చెప్పడంతో సుప్రీంకోర్టు కొంత విస్మయానికి లోనైట్లు తెలుస్తోంది. మరి ఏం చేయాలో మీరే చెప్పండి.. మేం మీ నుంచి భిన్నమైన ప్రకటన ఆశించామని అటార్నీకి సుప్రీం చెప్పింది. ఆ సందర్భంలో ప్రభుత్వ లాయర్ అయిన అటార్నీ వేణుగోపాల్ గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతి ఉన్నట్లు మాజీ జడ్జిలు ఆరోపణలు చేసినట్లు చెప్పారు. అందుకే భూషణ్కు వార్నింగ్ ఇస్తే సరిపోతుందని, ఆయన్ను శిక్షించాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలిపారు.