న్యూఢిల్లీ, ఆగస్టు 26
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయన డీప్ కోమాలోకి వెళ్లిపోయారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ ద్వారా ఆయనకు కృత్రిమ శ్వాస అందజేస్తున్నట్లు బుధవారం (ఆగస్టు 26) వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మూత్రపిండాల పనితీరు కూడా కాస్త కలత చెందేవిధంగా ఉందని తెలిపారు.84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి ఇప్పటికే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు భావిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. తాజాగా ఆయన మూత్రపిండాల పనితీరు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు.ఆరోగ్యం క్షీణించడంతో ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ హాస్పిటల్లో చేరారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ఓ నాళంలో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోగా.. మరింత క్షీణించింది. అంతేకాకుండా.. ఆపరేషన్కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.కరోనా వైరస్ కారణంగా ప్రణబ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. ఈ కారణంగా ఆయన ఊపిరితిత్తుల పనితీరు మందగించి ఆరోగ్యం మరింత క్షీణించిందని వెల్లడించారు. మరోవైపు.. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రణబ్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు.
=