న్యూఢిల్లీ ఆగస్టు 27
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీలో ఏర్పడిన పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తనపై తాను కాకుండా, బీజేపీపై సర్జికల్ స్ట్రైక్స్ చేయవలసిన అవసరం ఉందని హితవు పలికారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదపై ఆ రాష్ట్రంలోని ఓ జిల్లా యూనిట్ చేసిన తీర్మానంపై అసంతృప్తి తెలిపారు. జితిన్ ప్రసాద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ప్రత్యేక ఆహ్వానితుడు కూడా. ఇటీవల ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మందిలో ఆయన కూడా ఉన్నారు. కాంగ్రెస్కు పూర్తి కాలపు అధ్యక్షుడు కావాలని, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఈ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. లఖింపూర్ ఖేరీ జిల్లా కాంగ్రెస్ కమిటీ బుధవారం అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. సోనియా గాంధీకి లేఖ రాసినవారిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ 5 తీర్మానాలను ఆమోదించింది. ఈ నేపథ్యంలో కపిల్ సిబల్ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్లో, ఉత్తర ప్రదేశ్లో జితిన్ ప్రసాద అధికారికంగా టార్గెట్ అవుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తనను తాను టార్గెట్ చేసుకుంటూ శక్తిని వృథా చేయడానికి బదులుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేయడం అవసరమని పేర్కొన్నారు.