YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీలో చేరిన సింగం

బీజేపీలో చేరిన సింగం

చెన్నై, ఆగస్టు 27 
తమిళనాడు రాజకీయాల్లోకి ‘సింగం’ ఎంట్రీ ఇచ్చింది. సింగం అంటే హీరో సూర్య అనుకుంటారేమో. కాదు సూర్య రీల్ సింగం అయితే ఈయన రియల్ సింగం. సూర్య సినిమాకు స్ఫూర్తినిచ్చిన ఈ సిన్సియర్ పోలీసు ఆఫీసర్.. బీజేపీలో చేరారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కుప్పుస్వామి కర్ణాటకలో విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించిన ఆయన్ను కర్ణాటక వాసులు సింగం అన్నా అని పిలిచేవారు. 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన కుప్పుస్వామి.. సరిగ్గా ఏడాది తర్వాత బీజేపీలో చేరారు.బీజేపీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్.మురుగన్ సమక్షంలో అన్నామలై మంగళవారం బీజేపీలో చేరారు. తనకు బీజేపీ అంటే ఇష్టమని.. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఇంజినీరింగ్ చదివి, ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ పూర్తి చేసిన అన్నామలై.. పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకున్నారు. కానీ ప్రజలతో మమేకం కావొచ్చనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ వైపు మళ్లారు. ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత అన్నామలై కర్ణాటకలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. డ్రగ్ అడిక్షన్ గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాల గురించి ఎవరికీ తెలియకుండా విద్యార్థులు సమాచారం అందించేలా ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేశారు.2015 జనవరిలో అన్నామలై ఉడిపి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో 17 ఏళ్ల విద్యార్థిని రేప్, మర్డర్ కేసు విచారణతో ఆయన పేరు మార్మోగింది. 2017 చిక్కమంగళూరు అల్లర్లను ఆయన అణచివేశారు. అల్లర్లకు కారణమైన క్రిమినల్స్, సంఘ విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపారు. ఉడిపి ఎస్పీగా ఉన్న సమయంలోనే.. ఆయన ఖురాన్‌ను చదివి ఇస్లాంను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.2019లో ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై తమిళనాడులోని తన సొంతూరు కరూర్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసిన నాటి నుంచే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తన రాజీనామా లేఖలో.. ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని.. 2018లో కైలాస మానస సరోవరం వెళ్లినప్పటి నుంచి.. ఆలోచనలో పడ్డాడనని.. సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి మరణంతో కృతనిశ్చయానికి వచ్చానని ఆయన తెలిపారు.2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్ నేతల మరణంతో డీఎంకే, అన్నాడీఎంకే డీలా పడ్డాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటికీ.. పార్టీ పరంగా ఆయన ముందుకు వెళ్లడం లేదు. దీంతో తమిళనాట బలపడటానికి ఇదే సరైన సమయం అని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో నిజాయతీపరుడైన అధికారిగా పేరొందిన అన్నామలై బీజేపీలో చేరడం ఆ పార్టీకి ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
 

Related Posts