న్యూ ఢిల్లీ ఆగష్టు 28
భారతదేశ మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం లేదని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆగష్టు 10న ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత దిగజారినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలో ఉన్నారని మరియు వెంటిలేటర్ సపోర్ట్ తోనే కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారని తెలిపింది. అలాగే ఆయనకి మూత్రపిండాలు పనిచేయడం లేదని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రణబ్ బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి వైద్యులు ఆయన ఆరోగ్యం కుదుటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.