రేప్ కు వ్యతిరేకంగా సినీ తారలు కూడా ఈ దిశగా ఉద్యమిస్తున్నారు. తాజాగా సన్నీలియోన్, శ్రీరెడ్డి ,రష్మి , కంగనా రనౌత్, స్వరా ,కరీనా, హేమమాలిని వంటి సెలబ్రిటీలు ఎనిమిదేళ్ళ చిన్నారిని ఆలయంలో అత్యాచారం ఘటనపై ఫైర్ అవుతూ తమ వాదనని వినిపిస్తున్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల విరుచుకుపడుతోంది. సంచలన ప్రకటనలు చేస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్, తెలుగు నటి శ్రీరెడ్డి కూడా అదే దిశలో వెడుతున్నారు. జమ్ముకాశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనపై బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పరోక్షంగా స్పందించింది. చిన్నారులకు రక్షణ లేని సమాజం గురించి ఆమె ఆవేదన చెందింది. సినీరంగంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈమధ్య సంచలనం సృష్టించిన తెలుగు నటి శ్రీరెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ఇకపై తన పేరు శ్రీరెడ్డి కాదని, శ్రీశక్తి అని మార్చుకున్నానని తెలిపింది. ఇక కరీనా, స్వరా ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ‘నేను హిందుస్థానీని. నాకు సిగ్గుగా ఉంది. మా ఆసిఫాకు న్యాయం జరగాలి. ఎనిమిదేళ్ల ఆ చిన్నారిని అమ్మవారి ఆలయ సమీపంలోనే అత్యాచారం చేశారు’ అని పేర్కొన్నారు.