YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

దోస్త్ అడ్మిషన్లలో అక్రమాలు

దోస్త్ అడ్మిషన్లలో అక్రమాలు

కరీంనగర్, ఆగస్టు 29, 
దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యానికి పలు కళాశాలలు తూట్లు పొడుస్తూ అక్రమంగా అడ్డదారిలో ప్రవేశాలుపొందే పనిలో నిమగ్నమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని తమ కళాశాలల్లో నింపుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. నగదు, బహుమతులు వంటి విద్యార్థులకు ఆఫర్‌ చేస్తూ ప్రవేశాల పారదర్శకతకు మసి పూస్తున్నాయి. కమిషన్‌ విధానంలో పీఆర్‌వోలను, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు సిబ్బందిని సీట్లు నింపే ప్రక్రియలో ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో 90 ప్రైవేటు కళాశాలలుండగా ఇందులో 36410  సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాల కారణంగా వివిధ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మధ్య తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. పలు కళాశాలలు అయితే సీట్లు ఖాళీ ఉంచుకునే బదులు కొంతనైనా లాభపడవచ్చనే ధోరణితో ఆదాయ ధ్రువపత్రం తీసుకొస్తేచాలు అంతా మేమే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. మరికొందరు కళాశాలకు వచ్చే  విద్యార్థులకు బస్సుల ద్వారా రవాణా ఉచితమని, ఇంకొందరు నగదు, సెల్‌ఫోన్లు, వివిధ రకాల బహుమతులతో ప్రలోభపెడుతూ అడ్మిషన్లు ‘కొని’తెచ్చుకుంటున్నారు. అడ్మిషన్‌ తీసుకునే వరకూ ఒకమాట చివరగా పరీక్షల సమయంలో హాల్‌టికెట్‌ ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి కళాశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.కళాశాలలు ఫ్రీగా ప్రవేశాలిస్తున్నాయని వెళ్తే తర్వాత నాణ్యత ప్రమాణాలు లేక భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్తుందని గుర్తించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించి మంచి నాణ్యత ప్రమాణాలు ఉన్న కళాశాలల్లో చేర్పిస్తేనే బంగారు భవిష్యుత్‌ ఉంటుందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా కళాశాలలో ప్రవేశాలు తీసుకునేముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను సంప్రదించి అందులోని సదుపాయాలు, విద్యాప్రమాణాలు లోతుగా తెలుసుకొని ప్రవేశాలు పొందితే మంచి భవిష్యత్‌ ఉంటుందని  నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts