న్యూ ఢిల్లీ ఆగష్టు 31
జనాభా గణన మొదటి దశ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) నవీకరణ ఈ ఏడాది చేపట్టేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు షెడ్యూల్ ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘జనాభా గణన ప్రసుతానికి ముఖ్యమైంది కాదని. ఒక సంవత్సరం ఆలస్యం అయినా ఎలాంటి నష్టం ఉండదు’ అని ఓ సీనియర్ అధికారి అన్నారు. భారత దేశ జనాభా గణన ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలనా, గణాంక అభ్యాసాల్లో ఒకటని, ఇందుకు 30లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని పేర్కొన్నారు.కాగా, 2021లో జనాభా గణన, ఎన్పీఆర్ నవీకరణ మొదటి దశ ఎప్పుడు జరుగుతుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఉండదని స్పష్టం చేశారు. మొదట నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. మార్చి నుంచి కరోనా విస్తరిస్తుండడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే లక్షలాది మంది సిబ్బంది జనాభా గణన కోసం ఇంటింటీకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని ఉంటుందని, దాంతో వైరస్ ప్రబలే అవకాశం ఉందని, ‘సిబ్బంది ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని బలహీన పరచకూడదు’ అని మరో అధికారి పేర్కొన్నారు.