హైద్రాబాద్, ఆగస్టు 31
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గత కొన్నిరోజులుగా దూకుడు పెంచుతూ వస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సీబీఐ తో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( CEA )తో శాఖాపరమైన విచారణకు అదేశించాలి అని లేఖలో ఆయన ప్రధానిని కోరారు. ఈ సంఘటనలో క్రిమినల్ కోణం ఉంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం వల్ల కొందరికీ లాభం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును ఎండీగా ఉండడం వల్ల జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయన్నారు. ప్రభాకర్ హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలన్నారు ఎంపీ.శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం వల్ల బయట ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతుందని ఆరోపించారు. బయట ఎవరిదగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్.శ్రీశైలం పవర్ప్లాంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అరకోటి నష్టపరిహారం ప్రకటించింది. అయితే ప్రమాద స్థలాన్ని గతంలో పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్న తీరుపై రేవంత్ నిప్పులు చెరిగారు. శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా!? అంటూ మండిపడ్డారు. అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు.