దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో 14 మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలతో కూడుకున్న జవహర్ డంప్యార్డ్ క్యాపింగ్ పనులను చేపట్టాలనే విప్లవాత్మక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జవహర్నగర్ పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు 2019 సంవత్సరాంతంలోపు పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో క్యాపింగ్ను పూర్తిచేయాలని రాష్ట్ర మున్సిపల్ , పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించడంతో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షణలో ఈ పనులు సైలెంట్గా వేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా క్యాపింగ్లో తొలి దశలో భాగంగా, మొత్తం డంపింగ్ యార్డ్ను 150 మి.మి మందంతో మట్టితో పూర్తిగా కప్పి వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రతిరోజు దాదాపు 80టిప్పర్లు, జెసిబిలతో మట్టితో నింపే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది.130ఎకరాల విస్తీర్ణంలో 14మిలియన్ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న జవహర్నగర్ డంప్యార్డ్ క్యాపింగ్ పనుల ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద క్యాపింగ్ పను ప్రాజెక్ట్గా రికార్డు సాధించనుంది. ఇంతపెద్ద విస్తీర్ణంలో డంప్యార్డ్ను క్యాపింగ్ చేసే పనులు ఇప్పటి వరకు ఏ నగరంలోనూ చేపట్టలేదు. 625 చ.కి.మీ విస్తర్ణం కలిగిన గ్రేటర్ హైదరాబాద్ నగరం మొత్తం నుండి జవహర్నగర్లోనే దశాబ్దాల నుండి వేస్తున్నారు. దీనితో జల, వాయు కాలుష్యాలు ఏర్పడి జవహర్నగర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు రోడ్లపై బైటాయించి ఆందోళనలు కూడా చేపట్టారు. జవహర్నగర్ కాలుష్యంపై కొందరు గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనంతరం ప్రస్తుతం జవహర్నగర్ డంపింగ్యార్డ్ నుండి కాలుష్యం రాకుండా పలు చర్యలను చేపట్టారు. ఇటీవల రూ. 144 కోట్ల వ్యయంతో క్యాపింగ్ చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.జవహర్నగర్ డంప్యార్డ్ క్యాపింగ్ పనులను 2019 జూన్ మాసాంతంలోపు పూర్తిచేయాలని, ఇందుకుగాను పనులవారిగా గడువును విధిస్తూ ఉత్తర్వులో ప్రభుత్వం స్ఫష్టం చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుత వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యేలోపు ముందుగానే ఈ నెలాఖరు వరకు క్యాపింగ్లో తొలి అంకమైన మట్టితో మొత్తం డంప్యార్డ్ను కప్పే ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. దాదాపు 30 సెంటిమీటర్ల మందంలో డంప్యార్డ్ మొత్తం మూసివేసే పనులు పూర్తి అయితే జవహర్నగర్ డంపింగ్యార్డ్లోకి వర్షపు నీరు ఇంకి కాలుష్య కారక ద్రవాలు రాకుండా నిరోధించవచ్చనే ఉద్దేశంతో పనులు పూర్తి నిర్వహిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలు, శాస్త్రీయ పద్దతిలో ఆరు దశలుగా ఈ క్యాపింగ్ ప్రక్రియ చేపడుతారు. తొలుత డంపింగ్ యార్డ్పై పూర్తిగా మట్టితో కవర్చేస్తారు. ఇదే సమయంలో డంపింగ్లోని విషవాయువులను బయటికి పంపడానికి 300ఎం.ఎం వ్యాసార్థం కల పైపులతో 20 మీటర్లలోతులో బోరుబావులను తవ్వుతారు. డంప్యార్డ్ నుండి వర్షపు నీరు నేరుగా క్రిందికి జారేవిధంగా ఏటవాలుగా సరిచేస్తారు. అనంతరరం మట్టి పొరపై జియోసింథటిక్ క్లే లైనర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం దానిపై నుండి జియో కంపోజిట్ లేయర్ను ఏర్పాటు చేస్తారు. చివరగా 45 సెంటిమీటర్ల (ఒకటిన్నర అడుగు)మందంతో తిరిగి మట్టితో కూడిన పొరను ఏర్పాటు చేస్తారు. ఈ తుది మట్టి పొరపై గడ్డి, ఇతర మొక్కలు నాటడం జరుగుతుంది. మొత్తం డంపింగ్ క్రింది బాగం నుండి విషవాయువులు బయటికి రావడానికి వీలుగా క్యాపింగ్ అనంతరం డంప్యార్డ్పై బోరు బావుల మాదిరిగా పైపులైను చొప్పించి పై నుండి సులభంగా వాయువులు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. అనంతరం వెలవడే గ్యాస్ వాయువులు, డంపింగ్ యార్డ్ నుండి వచ్చే విషద్రవాలు (లీచెట్)ను శుభ్రపరిచే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. శాశ్వత ప్రాతిపదికపై చేపట్టనున్న ఈ భారీ క్యాపింగ్ ప్రక్రియను పాశ్చ్యత్య దేశాలలో మినహా దేశంలోని ఏ ఇతర నగరాల్లోనూ ఇంత వైశాల్యంలో చేపట్టడం జరగలేదు.జవర్నగర్ డంప్యార్డ్ క్యాపింగ్ పనులను డంప్ యార్డ్ నిర్వహిస్తున్న మేసర్స్ హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ క్యాపింగ్ పనులను చేపట్టింది. ఈ సంస్థ అంతర్జాతీయంగా క్యాపింగ్ రంగంలో విశేషానుభవం కలిగిన టెర్రా కన్సల్ట్ లిమిటెడ్ తో ఈ క్యాపింగ్ పనులను నిర్వహించనున్నది. టెర్రా కన్సల్టెంట్ లిమిటెడ్ గతంలో గల్ఫ్లోని కువాయిట్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10లక్షల మిలియన్ డంప్యార్డ్ క్యాపింగ్ పనులను పూర్తిచేసింది. అదేవిధంగా లెబనాన్లోని బిర్కట్ నామియా లాండ్ ఫిల్ క్యాపింగ్ను, బ్రిటన్లోని లంకాషైర్ విన్నీహిల్ లాండ్ఫిల్ క్యాపింగ్ను పూర్తిచేసిన అనుభవం టెర్రా సంస్థకు ఉంది. ఈ టెర్రా సంస్థ సహకారంతో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ క్యాపింగ్ పనులను నిర్వహిస్తోంది. సుధీర్ఘ కాలం తర్వాత జవహర్నగర్ డంప్యార్డ్ను క్యాపింగ్ చేయడం ద్వారా కాలుష్యం నుండి పరిసర గ్రామాల ప్రజలను విముక్తి చేయడం పట్ల ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు, మేయర్ రామ్మోహన్ ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.