తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 29న సరూర్నగర్ గ్రౌండ్లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించనుంది. సభ కోసం అనుమతి ఇవ్వాలని జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమని ఇటు పోలీసు శాఖ, అటు సరూర్నగర్ గ్రౌండ్ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సభకు మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది.తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటుకానుంది. పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ప్రజల కోసం.. ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఒక్కొక్కరు పది మందితో సభకు తరలిరావాలి.’ అని కోదండరామ్ నిన్న వరంగల్లో కోరారు.