మక్కా మసీద్ పేలుళ్ల కేసులో బాధితులకు న్యాయం జరగలేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మక్కా మసీద్ పేలుళ్ల తీర్పుపై ఆయన స్పందించారు. జూన్ 2014 తర్వాత కేసులోని సాక్ష్యులు వెనకడుగు వేశారని తెలిపారు. ఎన్ఐఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నేరాన్ని రుజువు చేయలేకపోయిందన్నారు. నిందితులకు బెయిల్ వస్తే ఎన్ఐఏ కనీసం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కు కూడా వెళ్లలేదని ఓవైసీ అన్నారు. మక్కామసీద్ పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తీర్పును వెల్లడించిన విషయం విదితమే. ఐదుగురు నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.