ప్రణామ్...అంటూ ముఖర్జీ సెలవు
న్యూఢిల్లీ,
సైనిక లాంఛనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలో పూర్తయ్యాయి. ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. లోధీ శ్మశాన వాటికలో కుటుంబ సంప్రదాయాల ప్రకారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం.. సైనిక లాంఛనాలతో ప్రణబ్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ప్రణబ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 10 రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసం నుంచి ఆయన పార్థీవ దేహాన్ని అంబులెన్స్లో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. సాధారణంగా ప్రముఖుల అంతిమ యాత్ర పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజీ వాహనంలో సాగుతుంది. కానీ కరోనా కారణంగా అంబులెన్స్లో ప్రణబ్ పార్థీవ దేహాన్ని తీసుకెళ్లారు.అంతకు ముందు ప్రణబ్ పార్థీవ దేహానికి రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, త్రివిధ దళాల అధిపతి రావత్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ తదితరులు ప్రణబ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారుప్రణబ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఆయన జ్ఞాపకార్థం కేబినెట్ రెండు నిమిషాలపాటు మౌనం పాటించినట్లు కేంద్రం హోం శాఖ తెలిపింది.