బెంగళూరు, సెప్టెంబర్ 2,
కర్ణాటకలో ఒక స్వామీజీ చేపట్టిన నిరసన సంచలనంగా మారింది. రోటీన్ కు భిన్నంగా దిగంబరంగా చేపట్టిన ఈ నిరసనతో అధికారులు కంగుతిన్నారు. ఇంతకూ ఆయన డిమాండ్ ఏమంటే.. సాధువులు.. సన్యాసులు.. మఠాధిపతుల వాహనాలకు టోల్ పన్ను మినహాయించాలని కోరుతున్నారు. బెంగళూరు రామోహళ్లికి చెందిన ఆశ్రమ అధ్యక్షుడు డాక్టర్ అరూఢ భారతీస్వామిజీ చేపట్టిన నిరసన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. బెంగళూరు నుంచి గౌరిబిదనూరుకు ప్రయాణిస్తున్న స్వామీజీ వాహనాన్ని తిప్పగానహళ్లి టోల్ గేట్ వద్ద నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో కారులో నుంచి దిగిన స్వామీజీ దిగంబరంగా మారి.. టోల్ గేట్ వద్ద నిరసనకు దిగారు. మౌనముద్రతో ధ్యానం చేయటంతో.. టోల్ నిర్వాహకులు వచ్చి.. స్వామీజీ కారుకు టోల్ మినహాయింపు ఇచ్చారు.దీంతో.. తన నిరసనను విరమించి స్వామీజీ వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వచ్చింది. దిగంబరంగా నిరసన చేపట్టిన స్వామిజీ ఫోటో ఇప్పుడ సంచలనంగా మారింది. స్వామీజీ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.