YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో ఎవరికి వారే పట్టు

బీహార్ లో ఎవరికి వారే పట్టు

పాట్నా, సెప్టెంబర్ 3, 
బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న జేడీయూ కూటమి ఎన్నికలకు సిద్ధమయింది. బీజేపీ, జేడీయూ, ఎల్జీపీ లు కలసి ఎన్నికలకు వెళ్లనున్నాయి. అయితే సీట్ల పంపకం ఇంకా కుదరలేదు. సీట్ల పంపకంపై మూడు పార్టీల నేతలు త్వరలోనే సమావేశం కానున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేసి అద్భుత విజయాలను సాధించాయి.అదే ఫార్ములాతో ఇప్పుడు బీహార్ ఎన్నికలకు జేడీయూ కూటమి సిద్ధమవుతోంది. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారంలోకి రావాలంటే 124 స్థానాలు అవసరమవుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమి బీహార్ 4ం పార్లమెంటు స్థానాలకు గాను 39 స్థానాలను గెలుచుకుంది. దీంతో తాము గెలిచిన పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను కావాలని బీజేపీ కోరే అవకాశముంది.కానీ జేడీయూ బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా బీహార్ లో అధిక స్థానాలను తమ పార్టీకే కేటాయించుకోవాలన్నది నితీష్ కుమార్ ఆలోచన. పార్లమెంటు స్థానాల ప్రకారం కాకుండా జేడీయూకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు తమకే కావాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు. అందుకే ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆర్జేడీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను కూడా తన పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇక కూటమిలోని మరో పార్టీ అయిన ఎల్జీపీ కూడా ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. ఎల్జీపీకి నేతృత్వం వహిస్తున్న చిరాగ్ పాశ్వాన్ ఇప్పటికే నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొంతకాలంగా బీహార్ లో కూటమిలోని ఎల్జీపీకి, జేడీయూకు మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని పరిష‌్కరించాల్సిన బాధ్యత కూడా బీజేపీ పెద్దలపైనే ఉంది. అందుకే బీహార్ ఎన్నికల్లో కూటమి ముందుగానే ఏర్పాటు చేసుకున్నా సీట్ల పంపకాల విషయంలో మరోసారి విభేదాలు రచ్చకెక్కే అవకాశాలున్నాయి. మరి అమిత్ షా ఏ మేరకు వీటిని పరిష‌్కరిస్తారో చూడాలి.

Related Posts