ఛండీగడ్, సెప్టెంబర్ 3,
వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడానికి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తొలి దశలో ఐదు యుద్ధవిమానాలు జులై 29న భారత్కు చేరగా.. ప్రస్తుతం అంబాలా వైమానిక స్థావరంలో ఉన్నాయి. వీటిని సెప్టెంబర్ 10న ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అధికారికంగా చేర్చనున్నారు. అయితే అత్యంత శక్తిమంతమైన ఈ విమానాలకు.. సాధారణ పక్షులు సమస్యగా మారాయి.వైమానిక స్ధావరం చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల పక్షులు గుంపులు గుంపులుగా చేరాయి. పక్షుల వల్ల రఫేల్ యుద్ధవిమానాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఐఏఎఫ్ డైరెక్టర్ జనరల్.. హరియాణా ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. హరియాణా చీఫ్ సెక్రటరీ కేశ్నీ ఆనంద్ అరోరాకు లేఖ రాసిన ఐఏఎఫ్ డైరక్టర్ జనరల్ (ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ) ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్.. పక్షుల సమస్యను వివరించారు.‘అంబాలా వైమానిక స్థావరంలో ఉన్న రఫేల్ యుద్ధ విమానాల భద్రత, రక్షణ భారత వైమానిక దళానిది ప్రధాన బాధ్యత. అయితే ఈ పరిసరాల్లో అధిక సంఖ్యలో పక్షులు సంచరిస్తున్నాయి. ఇవి విమానాలను ఢీకొంటే నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రదేశంలో పక్షుల సంచారాన్ని నియంత్రించేందుకు అనేక సూచనలు, విజ్ఞప్తులు చేశాం. ఇదే అంశంపై 2019 జనవరి 24, జులై 10, 2020 జనవరి 24 అంబాలా మున్సిపల్ జాయింట్ సెక్రెటరీ, అదనపు కమిషనర్తో వైమానిక స్థావరం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్.. ఏరోడ్రోమ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.వీటి బెడదను నివారించేందుకు సరైన వ్యర్థ నిర్వహణ విధానం అనుసరించాలని సూచించారు. ఈ చుట్టుపక్కల చెత్త పారబోసే వారికి జరిమానా విధించడం తదితర చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా, ఎయిర్ఫీల్డ్కు దూరంగా వ్యర్థ నిర్వహణ ప్లాంటులను ఏర్పాటు చేయాలి’అని మానవేంద్ర సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.అంబాలా వైమానిక స్థావరం చుట్టుపక్కల 10 కిలోమీటర్లు ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను తొలగించే విషయమై ఇప్పటికే మూడుసార్లు సమావేశమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదింపులు జరిపామని ఆయన తెలిపారు. ఐఏఎఫ్ డైరెక్టర్ రాసిన లేఖపై స్పందించిన హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. తదుపరి చర్యలకు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది