హైదరాబాద్ సెప్టెంబర్ 3
భారత్ లో అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్న తరుణంలో సోషల్ మీడియా అగ్రగామి సంస్థ అయిన ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ పై నిషేధం విధించింది. ఇకపై ఫేస్ బుక్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి పోస్టులు చేయకుండా నిషేధం విధించింది.అధికారంలో ఉన్న బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాఖ్యలపై ఫేస్ బుక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ చర్య తీసుకుంది. దీనితో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. హింసను ప్రేరేపిస్తూ ద్వేషాన్ని రెచ్ఛగొట్టేట్టు ప్రసంగాలు చేసే వ్యక్తులను నిషేధించాలన్న మా పాలసీని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు పేస్ బుక్ జెయింట్ ప్రతినిధి ఒకరు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ఈ మద్యే ఫేస్ బుక్ కు సంబంధించి అమెరికా సంస్థ అయిన వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించించిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రసంగాలను ఆ సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. భారత్ లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్ బుక్ ప్రతినిధి అంఖీ దాస్ ఉద్యోగులతో అన్నట్లు ప్రచురించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్ బుక్ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. ఆ తర్వాత బీజేపీని ఫేస్ బుక్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.