సమాచారం సిద్దం చేయాలి
హైదరాబాద్
ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సి.యస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభ లో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. సమావేశాల సందర్భంగా గౌరవ సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్ ను అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ సి.యస్ రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, వికాస్ రాజ్, రజత్ కుమార్, సునీల్ శర్మ, రవిగుప్త, సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.